“నేను గత 25 సంవత్సరాలుగా, ఆంధ్ర ప్రభ కాలనీ ఎదురుగా ఉండే ఈ రోడ్డు పక్కన బైక్, సైకిల్ మెకానిక్ గా పనిచేస్తున్నాను. నాకు 11 సంవత్సరాలు ఉన్నప్పుడు, మా కుటుంబం సూర్యాపేట లో ఉన్న మా ఊరు నుంచి విజయవాడ మకాం మార్చింది. మా నాన్న కూడా సైకిల్ మెకానిక్ గా పని చేసేవారు. మా నలుగురు పిల్లలకి చదువు చెప్పించలేరని, ఏడవ తరగతి తరువాత నేను చదువు మానేయాల్సి వచ్చింది. నగరంలో, ఎన్నో ఉద్యోగాలు ప్రయత్నించి, నా యవ్వనంలో సైకిళ్ళు, బైకులు రిపేర్ చేయడం నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇదే నా వృత్తి అయిపోయింది.
నేను రోజుకి దాదాపు పది గంటలు పని చేస్తాను. రోజుకి 500 నుంచి 600 రూపాయల దాకా సంపాదిస్తాను. కోవిడ్-19 వ్యాప్తి వల్ల, ఈ మధ్య రిపేర్ కోసం వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. సంపాదన కూడా బాగా పడిపోయింది. ఒక్కోసారి అసలు సంపాదన లేకుండా ఇంటికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కోసారి 200 నుంచి 250 వరకూ సంపాదిస్తాను. చేసే పనిని బట్టి, నేను డబ్బులు తీసుకుంటాను. నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు, అమ్మాయి ఏడవ తరగతి చదువుతుంది. మా అబ్బాయి 75 శాతం పైన మార్కులు సాధించినా, వాడ్ని మంచి కాలేజీలో చేర్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మా బాబు ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. అమ్మాయి ఏడవ తరగతిలో ఉంది. నా భార్య ఇటీవల టైలరింగ్ పని మొదలుపెట్టింది. ఆమె సహాయంతో వచ్చే విద్య సంవత్సరానికి సంబంధించి పిల్లల ఫీజు కట్టకలిగాము. మేము కట్టాల్సిన లోన్లు ఉన్నాయి కాబట్టి, మేము ఇంకా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నాకంటూ, కష్టాలూ, అప్పులు మాత్రమే మిగిలాయి. రోజూ ట్రైర్లు రిపేర్ చేసేటప్పుడు, నాకు వచ్చే ఆలోచన ఒకటే. ఏదో ఒకరోజు నా జీవిత చక్రం కూడా నాకు అనుకూలంగా తిరుగుతుంది అని!”