“మహల్రాజువారి పల్లె లో ఉండే మా పంట పొలాలు నుంచి లాభాలు ఆగిపోవడంతో, నేను, మా ఆవిడ పనికోసం మదనపల్లి టౌన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాం. నేను ఇక్కడ టీ బండి నడపడం మొదలుపెట్టి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. మా కూతుర్లిద్దరినీ బాగా చదివించాలని అనుకున్నాం. అందుకనే, మంచి రాబడి కోసం నాకున్నదంతా ఈ టీ స్టాల్ మీద పెట్టాను. నా భార్య కూడా పరిస్థితిని అర్థం చేసుకుని నా పక్కన నిలబడింది. వారాంతాల్లో నాకు విశ్రాంతి ఇచ్చి, నా కూతుళ్ళు టీ కొట్టు దగ్గర కూర్చుంటారు. నాకంటే వాళ్ళే బాగా వ్యాపారం చేస్తారు. వాళ్ళు చిన్నవాళ్ళే కానీ, తెలివైనవాళ్ళు అలాగే బాధ్యత తెలిసినవారు. మాకున్న అప్పులు తీర్చుకుంటూ, అమ్మాయిలకిద్దరికీ మంచి చదువు కూడా చెప్పించాం. పెద్దమ్మాయి 12వ తరగతి, చిన్నమ్మాయి 10వ తరగతి పూర్తిచేశారు. కరోనా వైరస్ మా జీవితాలని మార్చేసింది. దీనివల్ల, మా టీ స్టాల్ మూసేసి ఇంట్లో ఉండాల్సి వచ్చింది. మాకు చేయడానికి పని లేదు, చేతిలో డబ్బులు లేవు. నెలరోజుల్లో, మేము పోగు చేసిన డబ్బులు, మా దగ్గరుండే వనరులు అన్నీ అయిపోయాయి. పిల్లల చదువు, మేము తీసుకున్న అప్పులు, ఇంట్లో ఖర్చులు వీటన్నిటితోటి మేము తిరిగి మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. వర్షాల వల్ల, పల్లీల పంట వేశాము. ఎద్దులు కానీ, ట్రాక్టర్ కానీ అద్దెకి తీసుకోవడానికి కూడా డబ్బులు లేవు. మేము ఆశ కూడా వదిలేసుకున్నాం. చేసేది లేక, నా భార్య, పిల్లలు పొలం దున్నడానికి ముందుకి వచ్చారు. “నాన్న, మనం పొలం దున్నలేమా? అమ్మ, నేను, చెల్లి మేమందరం నీకు సహాయం చేస్తాం. నువ్వు కంగారు పడొద్దు”, అని నా పెద్ద కూతురు చెప్పింది. ముందు ఆనందం కలిగినా, తరువాత చాలా బాధ కలిగింది. వాళ్ళకి ఇంత కష్టం కలిగించాలా అనిపించింది. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళు చెప్పారు, కష్టపడదాం, మంచి ఫలం దొరుకుతుంది అని. తరువాతి రోజు నుంచి, మేము నలుగురం పొలం దున్నడం, మిగతా పనులు చేయడం మొదలుపెట్టాం. ప్రజల ద్రుష్టి నా మీద పడింది. ఉరి ప్రజలు నా ఫోటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టారు. వాటి వల్ల ప్రయోజనం కలుగుతుందని నేను అనుకోలేదు. నా వీడియోలు, ఒక ఛానెల్ నుంచి మరొక ఛానల్ కి చేరి జాతీయ మీడియా ఛానెల్ కి చెందిన కృష్ణమూర్తి గారు నన్ను కలిశారు. అలా అలా, సోనూ సూద్ గారు నన్ను సంప్రదించారు. తెర మీద విలన్ గా కనపడే ఆయన, మా జీవితాల్లో హీరో అయ్యాడు. ఆయన తో మాట్లాడడం, ఆయన ఎద్దులు తిరిగి ఇప్పించడం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఆయన మాకు ట్రాక్టర్ బహుకరించడం కూడా మర్చిపోలేం. మా కూతుళ్ళు ఎప్పుడెప్పుడు ట్రాక్టర్ నడుపుదామా అని ఎదురుచూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు గారు మా కూతుళ్ళని చదివిస్తా అనటం మాకు లభించిన అదనపు బహుమతి! ఈ మహమ్మారి వల్ల అందరూ కష్టాలు పడ్డారు. కానీ, ఒక మంచి మనసు వల్ల నా జీవితం ఎంతగానో మారిపోయింది. దీనికి కారణం అయిన వాళ్లందరికీ రుణపడి ఉన్నాను!”
![](https://humansofandhra.org/wp-content/uploads/2020/07/IMG_20200727_184555_649.jpg)