“ఈ మొక్కలన్నీ నా నర్సరీలో పెరిగేవే. వర్షఋతువులో కూడా ఈ మొక్కలకి మంచి గిరాకీ ఉంది. మన వాతావరణానికి సరిగ్గా సరిపోతుంది కాబట్టి, గులాబీ మొక్కలు బాగా అమ్ముడవుతాయి. మేము గులాబీలు, అలాగే వివిధ రంగుల మొక్కలు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తాము.
ఈ మధ్య, నేను టమోటా, పచ్చి మిర్చి, వంకాయ మొదలైన కూరగాయల మొక్కలు కూడా అమ్ముతున్నాను.
నేను ఈ రంగంలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు అయ్యింది. నా స్కూల్ చదువు పూర్తయ్యాక, ఒంగోలు లోని ఒక పెద్ద నర్సరీలో పని చేయడం ప్రారంభించాను. అక్కడ ఐదు సంవత్సరాలు పనిచేశాక, కర్ణాటక లో కన్స్ట్రక్షన్ వర్కర్ గా పని చేశాను. ఆ తరువాత మా అబ్బాయిల చదువు కోసం విజయవాడ తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. పిల్లలు ఎదిగేటప్పుడు, తల్లిదండ్రులు ఇద్దరూ పక్కనే ఉంటే బాగుంటుందనిపించింది.
అందుకని మా ఊరికి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు నాకు నేనే బాస్. నా వయసు ఇప్పుడు 48 సంవత్సరాలు.
మా అబ్బాయిలిద్దరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు. విజయవాడ తిరిగి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. నేను చేసే పని నాకు సంతృప్తినిస్తుంది. కానీ మొక్కల గురించి ప్రతి చిన్న విషయం, అలాగే మొక్కలు ఎలా బ్రతుకుతాయో కూడా తెలుసుకోవాలి.
తరచుగా మొక్కల ఆలనా పాలనా చూడాలి. వాటికి ఎరువులు, నీళ్ళు అందించడం అలాగే కుండీలు మార్చటం లాంటివి చేయాలి. మొక్కలని పిల్లలాగా చూసుకోవాలి. పంట ఎదుగుదలకి, మొక్కల బదిలీకి, రీపాటింగ్ కి వర్షాకాలం అనువైన సమయం.
మట్టి కుండలతో పోలిస్తే, ప్లాస్టిక్ కుండలు అంత మంచివి కావు. కానీ నా దగ్గరికొచ్చే కస్టమర్లు ఎక్కువశాతం అపార్టుమెంట్లలో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్లాస్టిక్ కుండీల వైపే మొగ్గు చూపుతారు.
నేను చేసేపనిలో చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని నేను ఆస్వాదిస్తాను! జీవితంలో ప్రతిరోజూ ముందుకు వెళ్ళడానికి అదే నాకు ప్రేరణనిస్తుంది.”