“జీవనాధారం కోసం నాకు 19 ఏళ్ళు ఉన్నప్పుడు గుంటూరులోని మల్లికార్జునపేట నుంచి ఈ నగరానికి వచ్చాను. మా నాన్న ఒక ఫ్యాక్టరీలో రోజు కూలీగా పనిచేసేవారు.అప్పులు పెరగడంతో,కుటుంబానికి సహాయం చేయడానికి చిన్న వయసులోనే ఉద్యోగం చేయాల్సి వచ్చింది. మా బంధువులు, స్నేహితులు కొంత మంది విజయవాడలో ఆటో డ్రైవర్లుగా పని చేసేవారు. రెండు సంవత్సరాల క్రితం, సొంతంగా ఆటో కొనుక్కునేవరకు వాళ్ళ దగ్గరే ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడ్ని.నేను ఈ వృత్తిలోకి వచ్చి 17 సంవత్సరాలు అయ్యింది. దేవుడి దయ వల్ల మార్చి రెండవ వరం వరకు బాగానే నడిచింది.
కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల గత ఐదు నెలలు బాగా కష్టంగా గడిచింది.
ఇంతకు ముందు రోజుకి 1,000-1,200 రూపాయల వరకూ సంపాదించేవాడ్ని. ఇప్పుడైతే రోజుకి, 300-400 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతున్నాను. ఈ ఏరియాలో, షేర్ ఆటోలు తక్కువ కాబట్టి సంపాదించడానికి నాకు ఒక అవకాశం ఉంది. రైల్వే స్టేషన్ దగ్గర ఉండే ప్యాసింజర్లు ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఫోన్ చేసేవారు. కోవిడ్-19 వల్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది.షేర్ ఆటో నడిపే వాళ్ళకి ఒక వెసలుబాటు ఉంది. వాళ్ళు ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్యాసింజర్లని ఎక్కించుకోగలరు. మేము తీసుకునే దాంట్లో, కేవలం 1/20 శాతమే తీసుకుంటారు కాబట్టి, కస్టమర్లు కూడా వాటి వైపే మొగ్గు చూపుతారు. మాకు కొన్ని సవారీలు మాత్రమే వస్తాయి. ఒక్కోసారి 15 కిలోమీటర్లు కూడా ప్రయాణించము. ఎల్పీజీ గ్యాస్ కోసం రోజుకి 200 రూపాయలు ఖర్చు పెడతాం.మేము సంపాదించేది దానికంటే తక్కువే ఉంటుంది.
నాకు స్కూల్ కి వెళ్ళే ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. పెద్దమ్మాయి 10 తరగతి, నడిపమ్మాయి 8, చిన్నమ్మాయి 6 వ తరగతి చదువుతున్నారు. ఈ లాక్డౌన్ సమయంలో మా దగ్గరున్న ఆదాయం మొత్తం ఖర్చయిపోయింది. అందుకనే, ఈ సంవత్సరం పిల్లల ఫీజు కట్టడానికి లోన్ తీసుకుందామని అనుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేయగలిగేది ఒకటే. రేపు బాగుంటుందని ఆశ పడటమే.”