“పిప్పర్మెంట్ గోళీలు, అరటిపళ్ళు, ఐస్ గోలా, వేయించిన పల్లీలు తింటూ సినిమా చూస్తే వచ్చే మజానే వేరు. ఆరోజులే వేరు, చాలా సరదాగా ఉండేవి. నేను సీనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమానిని. ఆయన సినిమా విడుదలయ్యిందంటే కృష్ణ మహల్ టూరింగ్ టాకీస్ లో మొదటిరోజు మొదటి ఆట చూడాల్సిందే. అప్పట్లో సినిమా చూస్తే ఒక రకమైన అనుభూతి కలిగేది. పక్కఊర్ల నుంచి ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చి మరీ సినిమా చూసేవాళ్ళు. అప్పట్లో ఎలాగైనా సినిమా చూడాలి అని ప్రయత్నం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
అప్పట్లో మొదటి ఆటకి టికెట్లు సంపాదించడం అంటే గొప్ప విషయం. 70ల్లో విడుదలైన ఎన్టీఆర్ అడవి రాముడు సినిమాకి 12 వారాల వరకూ టికెట్లు దొరకలేదంటే మీరు నమ్మగలరా. అలా టికెట్ల కోసం లైన్లో జనాలు నిలబడ్డం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యేది, అందుకోసం అని చెప్పి స్ట్రీట్ గార్డులుని నియమించేవాళ్ళు ఆ ట్రాఫిక్ ని మళ్ళించడం కోసం.
మల్టీప్లెక్సులు, ఆన్లైన్ బుకింగ్ వచ్చాక నగరం ఎంతగానో మారిపోవడాన్ని నేను గమనించాను. కృష్ణ మహల్ టూరింగ్ టాకీస్ ని మల్టీప్లెక్స్ గా మారుస్తారని మొన్నీమధ్యనే తెలిసింది. నాకు చాలా ఆశ్చర్యమేసింది. అది నేను, నా స్నేహితులు సినిమా చూసే చోటు. అది కేవలం థియేటర్ కాదు, మాకు రెండో ఇళ్లు లాంటిది. మేము ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆ చోటు ఇంతకు ముందులా ఉండదు. ఆ చోటు మారొచ్చు కానీ, దాంతో నాకున్న జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి.”